కౌశికుడు
కౌశికుడు కథ ప్రతి గృహస్థు తెలుసుకోవాలి.
అందులో బాధ్యతల నుండి పారిపోయే మగవాడి గురించి ఎంత విపులంగావుందో అంతే విపులంగా ఇంటి ఇల్లాలిబాధ్యతల గురించి కూడా చెప్పబడింది.
ఈ విషయాలే కాకుండా ఎటువంటిదైనా వృత్తి ధర్మాన్ని ఏ విధంగా ఆచరించాలో కూడా అరణ్యపర్వంలో ధర్మరాజు తెలుసుకుంటాడు.
కౌశికుడు ఒక గొప్ప ధర్మవేత్త. తపస్వి. వేదాలు ఉపనిషత్తులు అధ్యయనం చేసాడు. కాకపోతే తన వేదాధ్యాయనం కోసం తల్లి తండ్రుల అనుమతి లేకుండానే ఇల్లు వదిలి వచ్చేసాడు. కొడుకు మీద బెంగతో ఆ వృద్ధులు ఏడ్చి ఏడ్చి అంధులై పోతారు. వాళ్ళను ఆదుకొనే వారెవ్వరూ లేరు.
కాని వేదపఠనే ధ్యేయంగా భిక్షాటన మీద బతుకు సాగిస్తూ వున్నాడు.
ఒకనాడు చెట్టు కింద కూర్చొని వేదాధ్యాయనం చేస్తూండగా పైన చెట్టు కొమ్మమీద కూర్చొని వున్న ఒక కొంగ ఆయన తల మీద రెట్టవేస్తుంది.
దాంతో ఆయన కోపంతో మండిపడి ఆ కొంగ వంక కోపంతో చూస్తూ శపిస్తాడు. దాంతో ఆ కొంగ మరణించి కింద పడిపోతుంది.
ఏదో క్షణిక ఆవేశంలో ఆ విధంగా కోప ప్రదర్శన చేసినా తరువాత తాను చేసిన ఆ పనికి పశ్చాత్తాప పడుతాడు కౌశికుడు.
తరువాత అలవాటుగా వెళ్ళే ఇళ్ళవైపు భిక్షాటన చేస్తూ వెళ్ళుతాడు.
ఒక ఇంటిలో పనిలో నిమగ్నమైన ఇల్లాలు, అదే సమయానికి భర్త ఇంటికి వచ్చేటప్పటికి, ఆయనకు భోజనం వడ్డించి ఆ తరువాత భర్త ఎంగిలి పాత్రలోనే ప్రసాదంగా భావిస్తూ తాను కూడా భుజించి, భర్తకు సేవచేస్తూ, కాళ్ళు పిసుకుతూ నిద్రపోయేవరకు కౌశికుడి పిలుపును పట్టించుకోదు.
ఇన్ని బాధ్యతలు పూర్తిచేసుకున్న ఆ ఇల్లాలు భిక్ష తీసుకొని వచ్చేటప్పటికి, అప్పటికే భోజన వేళ మించిపోతూండటంతో ఆకలితో వున్న కౌశికుడి కోపపు చూపులు చూసి, తన ఆలస్యానికి కారణాలు వివరించి,
"స్వామీ మీ చూపులకు భస్మమైపోవటానికి నేనేమీ కొంగను కాను." అని అంటుంది.
అది విన్న కౌశికుడికి "ఎక్కడో అడవిలో జరిగిన సంఘటన ఈమెకు ఏ విధంగా తెలిసింది?" అని ఆశ్చర్యమేస్తుంది. ఆ మాటే ఆమెను అడుగుతాడు.
ఆ ప్రశ్నకు సమాధానంగా ఆ పతివ్రత ఎవరెవరు ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలో వివరించి, తాను ఒక గృహిణిగా భార్యగా కోడలిగా ఏఏవిధంగా వుందో తెలిపి,
“నా ధర్మాన్ని నేను సక్రమంగా నిర్వర్తిస్తున్న పతిసేవాఫలం వల్లనే నాకు అడవిలో జరిగిన విషయం తెలిసింది. కేవలం వేదాలు చదవగానే వాటిలోని యదార్ధరూపం తెలుస్తుందనుకోవటం పొరపాటు.
ఎవరి ధర్మం వారు సక్రమంగా నిర్వర్తించటమే వేదసారం. ఇంకా వివరంగా తెలుసుకోవాలన్న కోరిక వుంటే మిథిలాపురంలో ధర్మవ్యాధుని అడిగి తెలుసుకోండి." అని కౌశికుడిని పంపించి వేస్తుంది.
ఆ మాటలకు సంతోషించిన కౌశికుడు ఇంకా కొన్ని ధర్మపన్నాలు తెలుసుకోవటానికి, అడవులు గ్రామాలు పట్టణాలూ దాటుకుంటూ చాలా దూరంలో వున్న మిథిలా నగరానికి చేరుకొని ధర్మవ్యాధుడి గురించి విచారించి, అతన్ని కలవటానికి వెళ్ళి, అక్కడ అతను దుకాణంలో కూర్చొని మాంసం అమ్మటం కనిపించి సందేహంగా పక్కనే నిలుచుంటాడు.
ఆయనను చూసిన ధర్మవ్యాధుడు దగ్గరకు వెళ్ళి, "మహానుభావా స్వాగతం. మీరు ఎవరినైతే చూడాలని ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చారో ఆ ధర్మవ్యాధుడను నేనే." అంటూ తనను తాను పరిచయం చేసుకుంటాడు.
ఆ మాటలకు కౌశికుడికి ఇంకా ఆశ్చర్యం వేస్తుంది.
ధర్మవ్యాధుడు ఆయనను సగౌరవంగా ఇంటికి తీసుకొని వెళ్ళి సకల మర్యాదలు చేసి ఉచితాసనం మీద కూర్చోబెట్టుతాడు.
"నీకు ఈ మాంసం అమ్మి జీవించే ఘోరమైన వృత్తి ఏమిటి?"అని అడిగిన కౌశికుడికి సమాధానంగా,
"ఇది నా కులవృత్తి. మా తాతముత్తాతల నుండి వస్తున్నది. ఈ వృత్తి చేయకపోతే నేను ధర్మం చెడ్డవాడిని అవుతాను.
నాలుగు వర్ణాలవారూ, వారివారి కులవృత్తులు చేయటమే అసలైన ధర్మం.
అయినా నేను జీవహింస చేయను. ఎవరో చంపి తెచ్చిన జీవాలను అమ్మటం మాత్రమే నేను చేస్తాను.
నేను కూడా సదాచారపరుడినే.
మాంసాహారం భుజించను. నా కర్తవ్యాలను ఎటువంటి లోటూ లేకుండా చేసుకుంటూ పోతూంటాను." అంటూ శిష్టాచారం ఏ విధంగా ఆచరించాలో, దాని యొక్క యదార్ధ రీతిని వివరిస్తాడు.
చివరకు కౌశికుడిని ఇంటి లోపలి భాగంలో, వృద్ధులైన తల్లితండ్రులు వున్నతావుకు తీసుకొని వెళ్ళుతాడు.
"మహానుభావా, వీరే నాకు దైవాలు, వీరే నా వేదాలు. నా ప్రాణాలు వీరి సేవకే అంకితం. స్వయంగా నేనే వారికి కావలసినవన్ని అమర్చి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూసుకుంటాను." అంటూ తన దినచర్య వివరించి,
"ఆ మహా పతివ్రత పంపబట్టి మీతో ఇంతసేపు మాట్లాడాను. కాని తల్లితండ్రులను విస్మరించి ఈ విధంగా వేదపఠనం అంటూ అడవులలో తిరగే మీ వంటి వారితో సంభాషించటం నాకు ఏ మాత్రమూ సమ్మతము కాదు. ఈ విధంగా తిరగటం మీకు ధర్మం కాదు." అంటూ మాతాపితృల సేవగురించి బోధ చేస్తాడు.
అతని మాటలతో కౌశికుడు సంపూర్ణ ఙ్ఞానానందంతో గృహోన్ముఖుడై తల్లితండ్రుల సేవ చేసి వారిని ఆనంద పరుస్తాడు.
ఆ పతివ్రత చెప్పిన విషయాలు, ధర్మవ్యాధుడు చెప్పిన విషయాలు ఒక సముద్రం వంటివి. ఎంత చెప్పినా తరగనివి.